జపాన్‌లో భూకంపం.. నలుగురు మృతి, భారీగా ఆస్తినష్టం

టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం (Japan earthquake) సంభవించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తూర్పు జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.4గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు.కాగా, భూకంపం వల్ల నలుగురు మరణించగా, డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఫుకుషిమా రీజియన్‌లో ఒకరు, దానికి సమీపంలో ఉన్న మియాగీ రీజియన్‌లో మరొకరు ఉన్నారని చెప్పారు. భూకంపం దాటికి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని, అది ఎంతమేరకు ఉంటుందనేది అంచనా వేస్తున్నామని తెలిపారు. షిరోషిలో షింకన్‌సెన్ బుల్లెట్ రైలు పట్టాలు తప్పిందని వెల్లడించారు.

సముద్ర మట్టానికి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొన్నారు. భూకంపం ప్రభావంతో టోక్యో సహా అనేక నగరాల్లో విద్యుత్తు లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20 లక్షల ఇండ్లు అంధకారంలో చిక్కుకొన్నాయి. ప్రాణ నష్టంపై సమాచారం లేదు. పదకొండేండ్ల క్రితం 2011లో ఫుకుషిమా తీరంలో 9.0 తీవ్రతతో అత్యంత భయానక భూకంపం, ఫలితంగా సునామీ విరుచుకుపడింది. ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రంలో కూలింగ్‌ వ్యవస్థ దెబ్బతిని రియాక్టర్లు కరిగిపోయాయి. న్యూక్లియర్‌ రేడియేషన్‌ వాతావరణంలోకి వ్యాపించింది.

Post a Comment

 
Top