తైపీ: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌గా పరిగణిస్తున్న ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ డ్రాగన్‌ దేశాన్ని వణికిస్తోంది. బి.ఎ.2 గా పిలిచే ఈ కొత్త వేరియంట్‌తో నగరాలకు నగరాలు లాక్‌డౌన్‌ గుప్పిట్లోకి వెళుతున్నాయి. నిర్మానుష్యమైన రోడ్లు, ఎక్కడ చూసినా పీపీఈ కిట్ల ధరించిన వైద్య సిబ్బందితో కరోనా తొలి రోజులను గుర్తుకు తెచ్చే దృశ్యాలు ప్రస్తుతం చైనాలో కనిపిస్తున్నాయి. వైద్య సిబ్బందికి సహకరించేందుకు సైనికులూ రంగంలోకి దిగారు. స్టెల్త్‌ ఒమిక్రాన్‌తో మరణ భయం అంతగా లేకున్నా, ఇది వేగంగా విస్తరిస్తుందని, ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాలను అతలాకుతలం చేసే శక్తి దీనికి ఉందని షాంఘై ఫుడాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జాంగ్‌ వెన్‌హాంగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వేరియంట్‌ ప్రభావం ఆరంభదశలోనే ఉందని, ఇది భారీస్థాయిలో దేశాన్ని చుట్టేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో స్థానికంగా చైనాలో 1337 కేసులు నమోదయ్యాయి. ఇందులో జిలిన్‌ ప్రావిన్స్‌లోనే 895 కేసులు వెలుగు చూశాయి. ఇక్కడ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే పోలీసులు అనుమతి తప్పనిసరంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోటీ 70 లక్షల జనాభా ఉన్న షెన్‌జెన్‌ నగరాన్ని ఇప్పటికే చైనా దిగ్బంధం చేసింది. అక్కడ ప్రజలందరికీ మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. జిలిన్‌ ప్రావిన్స్‌లోని చాంగ్‌చున్‌ నగరంలో శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ అమలవుతోంది. రాజధాని బీజింగ్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి. నగరంలోని చాలా భవనాలను మూసివేశారు. షాంఘైలో 41 మంది వైరస్‌కు గురయ్యారు

Post a Comment

 
Top