రీ-రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచిన కేంద్రం
ఆర్సీ రెన్యువల్ ఆలస్యమైనా భారీ జరిమానా
నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

దిల్లీ: పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది! 15 ఏళ్లు దాటిన వాహనాలపై ఛార్జీలను సుమారు ఎనిమిది రెట్లు వడ్డించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై ‘హరిత పన్ను’ను విధిస్తూ రూపొందించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం- 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ను ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవడంతో పాటు... ఎనిమిదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా సామర్థ్య ధ్రువపత్రం తీసుకోవాలి. వ్యక్తిగత వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే నెలకు రూ.300 చొప్పున, వాణిజ్య వాహనాలైతే రూ.500 చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతాన్ని ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించారు. అక్కడ 15 ఏళ్లు దాటిన పెట్రోలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాల రీ-రిజిస్ట్రేషన్లను కేంద్రం ఇప్పటికే రద్దు చేసింది. వాటిని నడపాలనుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాల్సిందే.

Post a Comment