దిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలంతో విలవిలలాడుతున్న పలు ప్రపంచ దేశాలకు భారత్‌ టీకాలు పంపిణీ చేసి ఆదుకున్న విషయం తెలిసిందే. మొత్తంగా 98 దేశాలకు 16.29 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ రూపంలో, భారత టీకా తయారీ సంస్థల ద్వారా విక్రయాల రూపంలో పంపిణీ జరిగిందన్నారు. కేంద్ర విదేశాంగ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 21 వరకు 16.29 కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్లు, ఔషధాలతో పాటు కేంద్ర ప్రభుత్వం 65 దేశాలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు థర్మోమీటర్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌, సిరంజ్‌లు, టెస్ట్‌ కిట్‌లను విదేశాంగ శాఖ ద్వారా పంపిణీ చేసినట్టు తెలిపారు. మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 180.40 కోట్ల డోసులకు పైగా పంపిణీ జరిగింది. రేపట్నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించనున్నారు.

Post a Comment

 
Top