
తిరుపతి (నేరవిభాగం), న్యూస్టుడే: హత్యను ఆత్మహత్య కేసుగా మార్చిన సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు (సస్పెండ్) తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు సోమవారం ప్రకటించారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లికి చెందిన హేమసుందర్ గత నెల 6న మృతి చెందారు. మృతిపై అనుమానంతో భార్య ఉమామహేశ్వరి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఆర్సీపురం ఇన్ఛార్జి సీఐ అమర్నాథ్రెడ్డి పర్యవేక్షణలో ఇన్ఛార్జి ఎస్ఐ చిరంజీవి, పీసీ శోభనాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యగా నిర్ధారించి కేసు ముగించారు. దీనిపై మృతుడి భార్య ఈ నెల 7న స్పందన కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడుకు ఫిర్యాదు చేసి.. మృతుడి శరీరంపై ఉన్న గాయాల చిత్రాలను అందించారు. సమగ్రంగా విచారించిన ఎస్పీ హత్య జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఇన్ఛార్జి సీఐ, ఇన్ఛార్జి ఎస్ఐ, కానిస్టేబుల్ను వీఆర్కు పంపారు. అనంతపురం రేంజ్ ఇన్ఛార్జి డీఐజీ వెంకట రామిరెడ్డికి ఆ ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. సీఐ అమర్నాథ్రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, పీసీ శోభనాద్రిని విధుల నుంచి తొలగించాలని డీఐజీ ఉత్తర్వులిచ్చారు. ఆ మేరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Post a Comment